పాఠకుల ప్రశ్నలు
పాఠకుల ప్రశ్నలు
క్రైస్తవులకు పరలోక నిరీక్షణ కోసం ఇవ్వబడే పిలుపు ఎప్పుడు ఆగిపోతుంది?
బైబిలు ఆ ప్రశ్నకు ఖచ్చితమైన జవాబివ్వడంలేదు. అయితే, యేసు శిష్యులు పరలోక నిరీక్షణతో అభిషేకించబడడం సా.శ. 33 నుండి ప్రారంభమైందని మనకు తెలుసు. (అపొస్తలుల కార్యములు 2:1-4) అపొస్తలులు మరణించిన తర్వాత, “గోధుమలు” అయిన యథార్థ అభిషిక్త క్రైస్తవులు “గురుగులు” అయిన అబద్ధ క్రైస్తవులతో కలిసి ‘ఎదిగారు’ అని కూడా మనకు తెలుసు. (మత్తయి 13:24-30) ఆ తర్వాత 1800ల చివరిభాగం మొదలుకొని అభిషిక్త క్రైస్తవులు తిరిగి ఎంతో క్రియాశీలంగా తయారయ్యారు. అభిషిక్తుల చివరిసభ్యులు సమకూర్చబడడంతోపాటు 1919లో “భూమి పైరు” కోయబడడం ప్రారంభమైంది.—ప్రకటన 14:15, 16.
1800ల చివరిభాగం నుండి 1931 వరకు, క్రీస్తు శరీరానికి సంబంధించిన మిగతా సభ్యులు సమకూర్చబడాలనే ప్రధానుద్దేశంతోనే ప్రకటనాపని చేయబడింది. బైబిలు విద్యార్థులు 1931లో యెహోవాసాక్షులు అనే బైబిలు ఆధారిత పేరును స్వీకరించారు. ఈ ప్రత్యేకమైన పేరు, మత్తయి 20:1-16 వచనాల్లోని యేసు ఉపమానంలో ప్రస్తావించబడిన “దేనారము” అనే తలంపు కావలికోట (ఆంగ్లం), నవంబరు 15, 1933 సంచికలో వ్యక్తపర్చబడింది. ఆ ఉపమానంలో ప్రస్తావించబడిన 12 గంటలు, 1919 నుండి 1931 వరకు ఉన్న 12 సంవత్సరాలకు వర్తిస్తాయని భావించబడింది. పరలోక రాజ్యానికి పిలవబడడం 1931లో ముగిసిందని, 1930, 1931లలో క్రీస్తు తోటివారసులుగా ఉండేందుకు పిలవబడినవారు ‘చివరగా’ పిలవబడ్డారని ఆ తర్వాత అనేక సంవత్సరాల వరకు భావించబడింది. (మత్తయి 20:6-8) అయితే, 1966లో ఆ ఉపమానానికి సంబంధించిన సరిచేయబడిన అవగాహన వివరించబడింది, ఆ ఉపమానానికీ అభిషిక్తులు పిలవబడడం ఆగిపోవడానికీ ఎలాంటి సంబంధంలేదని స్పష్టమైంది.
ప్రకటన 7:9-15లో వర్ణించబడిన “గొప్పసమూహము,” “అంత్యదినములలో” సమకూర్చబడి, ఒక గుంపుగా హార్మెగిద్దోను యుద్ధాన్ని తప్పించుకునే భూ నిరీక్షణగల క్రైస్తవులైన “వేరేగొఱ్ఱెలు” అని 1935లో అర్థం చేసుకోబడింది. (యోహాను 10:16; 2 తిమోతి 3:1; ప్రకటన 21:3, 4) ఆ ఏడాది నుండి, గొప్ప సమూహంలోనివారు సమకూర్చబడాలనే ముఖ్య ఉద్దేశంతో శిష్యులను చేసే పని చేయబడింది. అందుకే, ముఖ్యంగా 1966 తర్వాత, పరలోక పిలుపు 1935లో ఆగిపోయిందని భావించారు. 1935 తర్వాత బాప్తిస్మం పొందినవారిలో దాదాపు అందరూ తమకు భూ నిరీక్షణ ఉన్నట్లు భావించినప్పుడు ఆ నమ్మకం సరైందన్నట్లు అనిపించింది. ఆ తర్వాత పిలవబడినవారు పరలోక నిరీక్షణ పొందినవారిలో అవిశ్వాసులుగా మారిన అభిషిక్త క్రైస్తవుల స్థానాలను భర్తీచేయడానికి పిలవబడ్డారని భావించబడింది.
ఒక అభిషిక్త క్రైస్తవుడు పశ్చాత్తాపపడకుండా సత్యం నుండి వైదొలిగినట్లయితే, యెహోవా ఖచ్చితంగా ఆయన స్థానంలోకి మరో వ్యక్తిని పిలుస్తాడు. (రోమీయులు 11:17-22) అయితే, యథార్థవంతులైన అభిషిక్తుల్లో అవిశ్వాసులుగా మారినవారి సంఖ్య ఎక్కువగావుండే అవకాశాలు చాలాతక్కువ. మరోవైపు, కాలం గడిచినకొద్దీ, 1935 తర్వాత బాప్తిస్మంపొందిన కొందరు క్రైస్తవులు తమకు పరలోక నిరీక్షణ ఉన్నట్లు పరిశుద్ధాత్మ ద్వారా సాక్ష్యం పొందారు. (రోమీయులు 8:16, 17) కాబట్టి, క్రైస్తవులు పరలోక నిరీక్షణకు పిలవబడడం ఫలానా తేదీన ఆగిపోతుందని మనం నిర్ణయించలేమన్నట్లు అనిపిస్తోంది.
ఒక వ్యక్తి తాను పరలోక నిరీక్షణకు అభిషేకించబడ్డానని హృదయంలో నిశ్చయించుకొని జ్ఞాపకార్థ చిహ్నాల్లో పాలుపంచుకోవడం ప్రారంభిస్తే, ఆయనను ఎలా దృష్టించాలి? ఆయనను తీర్పు తీర్చకూడదు. అది ఆయనకు, యెహోవాకు సంబంధించిన విషయం. (రోమీయులు 14:11-12) అయితే యథార్థవంతులైన అభిషిక్త క్రైస్తవులు ఇతరులు తమపట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని కోరుకోరు. తాము అభిషిక్తులము కాబట్టి, తమకు గొప్పసమూహంలోని కొందరు అనుభవజ్ఞులైన సభ్యులకు మించిన ప్రత్యేక “పరిజ్ఞానం” ఉంటుందని భావించరు. తమకు వేరే గొర్రెలకు చెందినవారికన్నా పరిశుద్ధాత్మ ఖచ్చితంగా అధికంగా ఉంటుందని వారు భావించరు, అలాగే ఇతరులు తమకు సేవలు చేయాలని ఆశించరు లేక తాము చిహ్నాల్లో పాలుపంచుకుంటున్నాం కాబట్టి తాము సంఘంలోని నియమిత పెద్దల కన్నా అధికులమని భావించరు. మొదటి శతాబ్దంలోని కొందరు అభిషిక్త పురుషులు పెద్దలుగా లేక పరిచర్య సేవకులుగా సేవచేయడానికి కూడా అర్హతపొందలేదని వారు వినయంతో గుర్తుంచుకుంటారు. (1 తిమోతి 3:1-10, 12, 13; తీతు 1:5-9; యాకోబు 3:1) కొందరు అభిషిక్త క్రైస్తవులు ఆధ్యాత్మికంగా బలహీనంగా కూడా ఉన్నారు. (1 థెస్సలొనీకయులు 5:14) సహోదరీలు అభిషిక్తులైనా, వారు సంఘంలో బోధించలేదు.—1 తిమోతి 2:11, 12.
కాబట్టి, అభిషిక్త క్రైస్తవులు వేరే గొర్రెలకు చెందిన తమ సహచరులతోపాటు ఆధ్యాత్మికంగా బలంగా ఉండడానికి కృషిచేస్తూ, ఆత్మ ఫలాలను వృద్ధిచేసుకుంటారు, సంఘంలో సమాధానానికి తోడ్పడతారు. క్రైస్తవులందరూ, అభిషిక్తులైనా లేక వేరే గొర్రెలకు చెందినవారైనా, పరిపాలక సభ నిర్దేశంలో సువార్త ప్రకటించి, శిష్యులను చేసే పనిలో కష్టపడి పనిచేస్తారు. తాము భూమ్మీద యెహోవాకు సేవకులుగా ఉండాలని ఆయన కోరుకున్నంతవరకు అభిషిక్త క్రైస్తవులు ఆ పనులు చేయడంలో సంతృప్తి పొందుతారు.